Tuesday 11 February 2014

GODDESS KAMAKSHI DEVI - KANCHIPURAM



అమ్మవారు కామాక్షిదేవిగా కాంచీపురంలో ఉంటూ తన కడగంటి చూపుతోనే సృష్టి స్థితి లయలు చేస్తుంది. సృష్టి - క; స్థితి - ఆ; లయ - మ. కళ్ళతోనే చేస్తోంది కనుక కామాక్షి. అక్కడికెళ్ళి భక్తులు ఎవరైనా జపం చేస్తే దయతో చూస్తుందిట. అందువల్ల అక్కడ చేసిన జపఫలం కోటి గుణితంగా ఫలిస్తాయి. కనుక ఈక్షేత్రానికి కామకోటి అనిపేరు. ఆగ్నేయ వాయవ్యములకు నడుమ అమ్మవారు ఉంది.
కాంచీపురానికి వాయవ్యం వైపు ఉంటుంది శివకంచి. ఇక్కడ ఉన్న లింగాలలో ఒక్క లింగాన్ని అర్చించినా లేదా ఆప్రాంగణంలో ఏలింగాన్ని అర్చించినా కోటిలింగార్చన ఫలం లభిస్తుంది. అందువల్ల దీనిని రుద్రకోటి అంటారు. కనుక శివుడు పృథ్వీలింగమై వెలసిన చోటు రుద్రకోటి. దీనికే రుద్రశాల అని పేరు కూడా ఉంది.అక్కడ ఒక అద్భుతమైన మామిడివృక్షం మనకి ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శివస్వరూపం. సంస్కృతంలోఆమ్రము అనగా మామిడి. ఒక్క మామిడి చెట్టురూపంలో ఉన్నాడు కాబట్టి ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. శివుడు వృక్షరూపంలోనూ, మూలంలో లింగరూపంలోనూ ఉంటాడు. లింగం సైకతలింగం. కదళీకుసుమాకారంగా(అరటిపువ్వు ఆకారంలో) ఉంటుంది. పరమేశ్వరుడు కొన్ని ఆలయాలలో రాతి రూపంలో, కొన్ని ఆలయాలలో స్ఫటిక రూపంలో, కొన్ని ఆలయాలలో వృక్షరూపంలో ఉంటాడు. యుగాలక్రితం పురాణాలు వృక్షరూపంలో ఉంటాడు అనిచెప్పాయి. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కొద్ది దశాబ్దాల క్రితం అక్కడ ఉండే పురాతన మామిడి చెట్టు దెబ్బతిన్నది. ఏకామ్ర రూపంలో శివుడు వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో చిత్రంగా మూలం నుంచి కొత్త మొలక వచ్చి మామిడి చెట్టు తయారయింది. భారతదేశం ఎలాంటిదంటే ఎంత మనం వాడగొట్టాలి, తీసిపారెయ్యాలి అన్నా మళ్ళీ మళ్ళీ చిగురించే మహావృక్షం లాంటిది భారతీయ సంస్కృతి. వేదంలో ఉందా అంటే ఉంది "వృక్షేభ్యో హరికేశేభ్యః". కనిపించే ప్రతి చెట్టుకీ శివుడు అని దణ్ణం పెట్టగలిగే సంస్కారం మనకి రావాలి.

No comments:

Post a Comment